రూ.45 లక్షలు, ఉద్యోగం కోసం పక్కా ప్లాన్.. ప్రియుడితో కలిసి తల్లిని చంపిన బాలిక

  • ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి దారుణానికి పాల్పడిన దత్త పుత్రిక
  • దిండుతో ఊపిరాడకుండా చేసి చంపి, బాత్రూంలో పడిందని నాటకం
  • అనుమానంతో బంధువుల ఫిర్యాదు.. విచారణలో నేరం అంగీకారం
రూ.45 లక్షల నగదు, ప్రభుత్వ ఉద్యోగంపై కన్నేసిన 17 ఏళ్ల బాలిక తన దత్తత తల్లిని ప్రియుడితో కలిసి కిరాతకంగా అంతం చేసింది. ఆ తర్వాత తల్లి బాత్రూంలో జారిపడి చనిపోయిందని నాటకమాడి బంధువులను నమ్మించింది. అయితే, మృతదేహంపై ఉన్న గాయాలు అనుమానాలకు తావివ్వడంతో అసలు నిజం బయటపడింది.

రాంచీకి చెందిన నహీదా పర్వీన్ దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఓ బాలికను దత్తత తీసుకున్నారు. నాలుగేళ్ల క్రితం విద్యుత్ శాఖలో పనిచేసే ఆమె భర్త మరణించడంతో పరిహారంగా రూ.45 లక్షలు అందాయి. ఈ మొత్తానికి నహీదా తన 17 ఏళ్ల దత్తపుత్రికను నామినీగా పెట్టింది. అయితే, ఆ బాలిక అర్బాజ్ అనే యువకుడితో ప్రేమలో పడి, తల్లికి తెలియకుండా డబ్బు ఇవ్వడం మొదలుపెట్టింది. విషయం తెలుసుకున్న నహీదా కూతురిని మందలించడంతో తల్లిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.

తల్లిని చంపేస్తే రూ.45 లక్షలతో పాటు, కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కూడా వస్తుందని, ప్రియుడితో సుఖంగా బతకవచ్చని ప్లాన్ వేసింది. ఈ హత్యకు ఏకంగా రూ.12 లక్షలు ఖర్చు చేసినట్టు తెలిసింది. ఏప్రిల్ 24న రాత్రి నహీదా నిద్రిస్తున్న సమయంలో బాలిక తన ప్రియుడు అర్బాజ్, అతడి స్నేహితులతో కలిసి దిండుతో ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది. 

మరుసటి రోజు బాత్రూంలో జారిపడి చనిపోయిందని బంధువులను నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసింది. అయితే, నహీదా బావకు మృతదేహంపై గాయాలు కనిపించడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి, బాలికను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేయించినట్లు అంగీకరించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Nahida Parveen
Ranchi
murder
government job
stepdaughter
Arbaz
property dispute
crime
police investigation
Jharkhand

More Telugu News